సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రజల సమస్యల పరిష్కారానికి సమిష్టిగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) లో అందిన ప్రతి అర్జీని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన, శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.నేడు, శుక్రవారం భీమవరం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలను స్వయంగా స్వీకరించారు. నియోజకవర్గం నుంచి 112 అర్జీలను స్వీకరించారు.
కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు” కార్యక్రమం ద్వారా ప్రజలు అధికారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అధికారులే నేరుగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను స్వీకరిస్తున్నారన్నారు. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు.ఎమ్మెల్యే, పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ఇళ్ల స్థలాలు, వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు, ఉపాధి అవకాశాలు, రేషన్ కార్డులు, భూమి రీ-సర్వే, తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు, రోడ్ల మరమ్మతులు తదితర అంశాలకు సంబంధించిన అర్జీలు అధికంగా వచ్చినట్లు పేర్కొన్నారు.
