సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తమ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లినందుకుగాను, ఆక్వా రైతుల ప్రతినిధి బృందం నేడు ఆదివారం భీమవరంలోని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. ఫీడ్ ధరలు అమాంతం పెరగడం వల్ల ఆక్వా రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం సీరియస్గా కసరత్తు చేస్తోందని తెలిపారు. గత వారం ఆక్వా రైతుల ప్రతినిధి బృందం ఢిల్లీకి వచ్చి సమస్యలను వివరించిన వెంటనే కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, శ్రీమతి నిర్మలా సీతారామన్ తో ప్రత్యేకంగా సమావేశమై ఆక్వా రైతుల ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్లామని శ్రీనివాస వర్మ వివరించారు.
