సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హమ్మయ్య పశ్చిమ గోదావరి పంట కాలువలు ప్రవాహాలతో మరల జలకళతో కనపడనున్నాయి. ముందుగా ప్రకటించిన ప్రకారమే డెల్టా కాలువలకు సాగునీటిని విడుదల చేశారు. ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి ప్రజా ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. నిడదవోలు మండలం విజ్జేశ్వరం వద్ద హెడ్ స్లూయిస్ వద్ద మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక పూజలు అనంతరం స్లూయిజ్ గేట్లు ఎత్తే స్విచ్ ఆన్చేసి పశ్చిమ డెల్టా కాలువలకు నీటిని విడుదల చేశారు. గోదావరి డెల్టా కాలువలకు నీటిని విడుదల చేయడం ద్వారా సుమారు 5 లక్షల 30 వేల ఎకరాల ఆయకట్టు కు నీరు అందించడం జరుగుతుందన్నారు. రైతాంగానికి జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు ఖరీఫ్ సీజన్కు నీరందుతుందన్నారు. మొదటగా కాలువలలో పేరుకున్న కుళ్ళు పోయిన వ్యర్దాలు తొలగిపోయాక , మన భీమవరం , ఉండి పంట కాలువలుకు గోదావరి నీరు మరో 4 రోజులలో చేరే అవకాశం ఉంది. 7రోజుల తరువాత చెరువులు నింపి వాటిని శుద్ధి చేసి ప్రజల సాగునీటి అవసరాలకు నీటిని ఉపయోగిస్తారు.
